త్వరలో..
మధుబాబు గారి, 'శ్యామ్ సుందర్ - వాత్సవ' Detective Crime Fantasy Adventure 'నిశ్శబ్దనాదం' - 31-01-2026 నుంచి ప్రారంభం..
మనిషి ఎదురుగా కనిపించకుండా మాటలు వినబడటం డెఫినిట్గా మెదడుకు ఏదో వ్యాధి సోకిందని చెప్పే సూచనే.
చూస్తూ కూర్చుంటే అది మరింత అధికమై, తనెవరో ఏం చేస్తున్నాడో ఎటు పోతున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
వెంటనే కదలాలి తను. అక్కడినించి బయటపడి అర్జంటుగా తనకు తగిలిన గాయాలకు సరైన చికిత్సను చేయించుకోవాలి.
బండరాయిని గట్టిగా పట్టుకుని శిలావిగ్రహంలా నిలబడి వున్న శ్యామ్ సుందర్ పరిస్థితి తనకు తెలిసిపోయినట్లు మరింత గంభీరంగా వినవచ్చింది ఆ కంఠం.
“ఇప్పుడు నువ్వు సరైన ఆలోచన చేస్తున్నావు. ఇందాకటి నించీ నీకు నేను చెపుతున్న మాటల్నే తిరిగి నువ్వు మననం చేసుకుంటున్నావు. ముందు ఆ బండను వదిలి నడక మొదలుపెట్టు... నడువ్... త్వరగా...”
ఆ కంఠం ఎవరిదో, ఎక్కడినించి వినవస్తోందో తెలుసుకోవాలన్న కోరికను పూర్తిగా వదిలేశాడు శ్యామసుందర్. బండను వదిలి రెండు అడుగులు ముందుకు వేశాడు.
మూడో అడుగు వేయబోతుండగా, చిన్నగా కదిలింది ఇసుకలో నిస్త్రాణంగా పడి వున్న మేకపిల్ల. లేచి నిలబడేందుకు అవసరమైన ఓపిక నశించిపోవటం వల్ల, తలను మాత్రం కొంచెంగా పైకెత్తి చిన్నగా అరిచింది.
అసలేం జరిగింది? మనస్సులో మాటల్ని కూడా గ్రహించి మాట్లాడుతున్న ఆ కంఠం ఎవరిది!

